హైదరాబాద్ : చర్చలు జరుగుతుండగా మళ్లీ వస్తామని చెప్పి టీఎస్ఆర్టీసి కార్మిక నేతలు వెళ్లిపోయారని, తిరిగి రాలేదని నిన్న(శనివారం) అధికారులు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పందించారు. నిన్న చర్చల సమయంలో తాము మధ్యలో వెళ్లిపోలేదని, బాధ్యతగల ఐఏఎస్ అధికారులు అబద్ధాలు చెప్పవద్దని అన్నారు. చర్చలకు మళ్లీ పిలుస్తామన్న అధికారులు పిలవలేదని వివరించారు.
జెఎస ఇచ్చిన డిమాండ్లపై చర్చించాలని తాము కోరామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు ఎప్పుడు పిలిచినా వెళ్తామని, రేపు కోర్టు ప్రారంభమయ్యే సమయంలోపు పిలిచినా చర్చలకు వెళ్లేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. కాగా, కోర్టుకు నివేదిక ఇవ్వాలి కాబట్టే, నామ మాత్రంగా తమను చర్చలకు పిలిచారని కార్మిక నేతలు నిన్న కూడా మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ సమ్మెకు సంపూర్ణ మద్దతు లభిస్తోందని..ఈనెల 28న అన్ని కలెక్టరేట్ల వద్ద విజ్ఞాపన పత్రాలు అందజేస్తామన్నారు. సరూర్నగర్లో 30వ తేదీన జరిగే సకల జనుల సమరభేరికి అన్ని ఆర్టీసి కుటుంబాలు, రాజకీయ పార్టీల నేతలు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.